Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ముప్పదియైదవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 35

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియైదవ అధ్యాయము

(ఊదీప్రభావము)

పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట

1. కాకామహాజని స్నేహితుడు, యజమాని. 2. బాంద్రా అనిద్ర రోగి. 3. బాలాపాటీలు నేవాస్కర్.

ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును.

ప్రస్తావన

ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు, శాఖలు, మన యభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతు డాకారముగలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమయనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేల యందురు. ఇతర శాఖలవారు కూడ ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతరయోగులకు నమస్కరించి వారికి సేవ చేయ నేల? యందురు. సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగిగుణము లెక్కడ? అని విమర్శించిరి. అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిలచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణ లీ దిగువ నిచ్చుచున్నాము.

కాకా మహాజని స్నేహితుడు

కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కాని, బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణశక్తి యేమని చెప్పుదును? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు " ఇది తప్పనిసరిగా మా తండ్రికంఠమే" యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.

ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని యిచ్చెను. బాబా కాకానే దక్షిణ యడుగు చుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు?" అని యడిగెను. "నీవే బాబాను అడుగుము" యని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా, తన స్నేహితుడు తానుకూడ దక్షిణ యివ్వవచ్చునా యని బాబాను అడిగెను. బాబా "నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను. కాన నిన్నడుగలేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్న యెడల ఇవ్వవచ్చు" ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణము అతని స్నేహితుడు కూడనిచ్చెను. బాబా యపుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. "నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచు కొనగలము; కలిసికొనగలము." పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికిపోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీద్వారా యెగిరిపోయెను. వారి యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను.

కాకామహాజని - యజమాని

థక్కర్ ధరమ్సె జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు కొక కంపెని గలదు. దానిలో కాకా మేనేజర్ గా పని చేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్నిదినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి థక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోను, థక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా యెప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక థక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలుదేరిరి. బాబా కిచ్చుటకై కాకా రెండుసేర్ల యెండుద్రాక్షపండ్లు (గింజలతోనున్నవి) దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాలాసాహెబు, తర్ఖ డుండెను. తర్ఖడ్ మీరెందుకు వచ్చితిరని థక్కరు నడిగెను. దర్శనముకొరకని థక్కరు జవాబిచ్చెను. మహిమ లేమైన జరిగినవా యని థక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను. ధక్కరుకు కొన్నిద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట కిష్టములేదు. కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజ లుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు తన జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను? ఈ యోలోచన అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందు కతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదను కొనెను గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. థక్కరు ఆశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి యైనచో, ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను. అతని మనస్సు నందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకావద్దనుంచి యెండు ద్రాక్షల పంపిణి ప్రారంభింప వలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో థక్కరు సంతుష్టి చెందెను.

శ్యామా థక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా యిట్లనెను. "అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలడు". కాకా యీ జవాబుకు చాలా ప్రీతిచెందెను. తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను.

మధ్యాహ్నహారతియైన పిమ్మటు, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను.

"ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యు డుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటములు పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారము లన్నియు వదిలివేయుచుండెను; మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను, "నీ కిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకేచోట నాశ్రయించుకొని నిలకడగా నుండు" మని చెప్పితిని."

వెంటనే ధక్కరదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలె ననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరకునని యెవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞ నిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరు కింకొక నిదర్శనము దొరికెను.

బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతని కిట్లని చెప్పెను. "నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును."

ఈ మాటలు విని, థక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన, అతని సంశయము లన్నియును తొలగెను. ఆతడెంతయో నేర్చుకొనెను.

అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా యెవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించెడువారు కాదు. వారు ద్వంద్వాతీతులు.

నిద్రపట్టని రోగము

బాంద్రానివాసి కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్దమనుష్యుడు చాలకాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి, యేమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగ బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటకి రాసుకొని మిగత పొట్లమును తలక్రింద దిండుకు దిగువ బెట్టుకొను మనెను. ఇట్లు చేసిన పిమ్మట, సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచినిద్రపట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడుసాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించు చుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించు చుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను.

బాలాజీ పాటీలు నేవాస్కరు

వీరు బాబాకు గొప్పభక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండ చాలమంచి సేవ చేసిరి. ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నిటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. వారి యనంతరము ఈ పని రాథాకృష్ణమాయి, యతిశుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతిసంవత్సరము పంట కోయగనే దాని నంతయు దెచ్చి, బాబా కర్పితము చేయుచుండెను. బాబా యిచ్చినదానితో తాను కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాలసంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను.

ఊదీ ప్రభావము

ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజనసమయానికి పిలచినవారికంటె మూడురెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు, కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె యత్తగారు ఓదార్చుచు, "భయపడకుము. ఇది మనది కాదు. ఇది సాయి యాహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగ కప్పివేయుము. వానిలో కొంచెము ఊదీ వేయుము. గుడ్డ పూర్తిగ తీయకుండ వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును." అనెను. ఆమె యీ సలహా ప్రకారమే చేసెను. వచ్చినవారికి భోజనపదార్థములు సరిపోవుటయేగాక, ఇంకను చాల మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో, యథాప్రకారము ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది.

సాయి పామువలె గాన్పించుట

ఒకనాడు షిరిడీవాసి రఘుపాటీలు నెవాసెలో నున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాల మొకపాము ఆవులకొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని వశువులన్నియు భయపడి కదల జొచ్చెను. ఇంటిలోనివారందరు భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నెతో పాలు దెచ్చి సర్పము ముందు బెట్టి యిట్లనెను. "బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ యలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము." ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్ది సేపటిలో సర్పము తనంతటతానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించ లేదు.

బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. వారికొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో బాబా వారికి ఇచ్చుచుండెడివారు.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియైదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
V. Rama Aravind.
2009-12-24.
Posted on: 2009-12-24.
Last updated on: 2011-11-08.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me