Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook


Topic 66

శ్రీ సాయి సత్ చరిత్రము
18, 19 అధ్యాయములు
Shri Sai Satcharitra - Chapters 18 & 19

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

18, 19 అధ్యాయములు

హేమడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి యాశీర్వదించెను?

సాఠేగారి కథ; దేశ్ ముఖ్ గారి భార్యకథ; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిజూపుట; ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి.

గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా యెట్లు ఆదరించెనో హేమడ్ పంతు వర్ణించెను. ఈ వచ్చే రెండు అధ్యాయములలో హేమడ్ పంతును బాబా యెట్లు ఆమోదించి యాశీర్వదించెనో, బాబా యెట్లు మంచి యాలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందా వాక్యములగూర్చి, కష్టమునకు కూలి మొదలగు వానిగూర్చి, బాబా వారి ప్రబోధలెట్టివో వర్ణింతుము.

ప్రస్తావము

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపుననువిషయ మందరికి తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించుదాని నితరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనము లగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్ష కాలపు మేఘమువంటివారు. వారు తమ యమృతతుల్యము లైన బోధలు పుష్కలముగా విశాలప్రదేశములందు కురిపెదరు. వానిని మన మనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన 'రామరక్షాస్తోత్రము' ను బుధకౌశిఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట దెలిపెదము.

ప్రేమగల తల్లి, గుణమిచ్చుచేదైన యౌషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయునట్లు, ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది. వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి యాత్మయొక్క దైవీసౌందర్యములను జూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని సేవించి, వారి ప్రేమనుపొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను బాధలను తొలగించి, మనల సంతోషపెట్టును. ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయమువలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగనమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ యధ్యాయములోని ముఖ్యకథను ప్రారంభించెదము.

సాఠేయనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. ఇంక మరికొన్ని విషయము లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచార గ్రస్తుడయ్యెను; విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లువిడచి చాలా దూరము పోవలె ననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడుగాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా నిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వతబ్రహ్మవలె స్వయంప్రకాశుడై, నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యమువలన బాబా యెక్క పవిత్రమయిన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తికాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను; బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటివారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యనుకొనెను. ఆ మరుసటిదిన మాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము చేయవలెనో కనుగొను మనెను. సమయము దొరికినప్పుడు కాకా సాహెబు బాబాను ఇట్లడిగెను. "ఓ దేవా! యీ దృశ్యమువలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు; అతని కోరిక నెరవేర్చవలెను అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు" డనిన, బాబా "అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో, నాతడు పావనుడగును; మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధములనుండి తప్పించును." అనెను.

ఆ సమయమున హేమడ్ పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లను కొనెను. "సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా! నేను నలుబది సంవత్సరములనుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదా! అత డిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా యేమి? చాతక పక్షి మేఘమునుంచి పడు నీటిబిందువుకై కని పెట్టు కొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను." ఈ యాలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి యాలోచన లన్నియు బాబా గ్రహించెడివారు. అంతయేగాక, చెడ్డ యాలోచనలను అణచుచు, మంచి యాలోచనలను ప్రోత్సహించువారు. హేమడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామావద్దకు పోయి అతనివద్ద 15 రూపాయలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయ మయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాట గలవారెవరు?

హేమడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు వచ్చెను. అప్పుడే యతడు స్నానము చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమడ్ పంతు నిట్లడిగెను. "మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ యేలయున్నారు? మీరు మసీదునుండి వచ్చుచున్నట్లున్నదే! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు? మీరొంటరిగా వచ్చినారేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడెదము." ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమడ్ పంతు ముందర వసారాలో గూర్చొనెను. కిటికీలో 'నాథభాగవత' మను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము 'భావార్థ దీపిక' లేదా జ్ఞానేశ్వరి, (శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమయిన) ఏకనాథభాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునపుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమడ్ పంతు కూడ నిత్యము నాథభాగవతమును పారాయణము చేయువాడు.

ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలోనున్న నాథభాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తిచేయుటకే కాబోలు బాబా యచ్చటకు పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తిచేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమడ్ పంతు:- నేను బాబా వద్ద నుండియొక వార్త తీసికొని వచ్చినాను. నీవద్దనుండి 15 రూ దక్షిణ తీసికొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి యున్నారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని యన్నారు. శ్యామా:- (ఆశ్చర్యముతో) నావద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగనమస్కారములు డబ్బునకు బదులుగా తీసికొని బాబా వద్దకు వెళ్ళుము. హేమడ్ పంతు:- సరే నీ నమస్కారము లామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడు కొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును, కథలును చెప్పుము. శ్యామా:- అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని (బాబా) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరివాడను. నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే యీ తమలపాకులు, వక్క, సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హేమడ్ పంతుతో మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్లనియెను. "ఈ భగవంతుని (బాబా) లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతులేదు. వాని నెవరు గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వానినంటునట్లు కాన్పించరు. మావంటి జానపదుల కేమి తెలియును? బాబాయే యీ కథల నెందుకు చెప్పరాదు? మీవంటి పండితులను మూర్ఖునివద్ద కేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను." ఈ యుపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను. 'నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నా కది స్వయముగా తెలియును.' భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో; బాబా యంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినపరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. (ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము.)

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండు ననుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్

రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాభా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనో నిశ్చయము చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదెశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడుదినములవరకు మానివేసెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. "దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని, నీ వెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశ మివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెనుకరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము". ఆమె మనో నిశ్చయమును జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.

"ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీ కది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారిసేవ చేయుటకు, వారివద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండు పైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని. "మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులు 1. దృఢమైన విశ్వాసము 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని, వారు సంతోషించిరి.

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకుగాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్ప వచ్చును. నేను దాని నెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు, వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియిందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి (ఓపిక) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుషలక్షణము. అది పాపము లన్నిటిని తొలగించి, భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గణి, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ (నమ్మకము), సాబూరి (ఓపిక) అన్యోన్యముగా ప్రేమించు అక్క చెల్లెండ్రవంటివారు.

నా గురువు నానుండి యితర మేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను గూడ మా గురువుదృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్ర మెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువు నందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయు వాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) యవతారమని యెంచెదరో వారే ధన్యులు."

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యాముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను.

ఈ కథను జాగ్రత్తగాను, శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి, హేమడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామా అతని నీస్థితిలో జూచి "ఏమి జరిగినది; యేల యూరకున్నవు? అట్టి బాబా లీలలు నీ కెన్ని వర్ణింపవలెను?" అని యడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు భాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెదననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను. బాబా యిట్లనెను. "సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీ రేమి మాట్లాడితిరో చెప్పుము." గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని, లెక్కించక హేమడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాల ఆనందము కలుగ జేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు ఆ కథరూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా యిట్లనియె. "కథ చాల అద్భుతమైనది. నీ వెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము." అప్పుడు హేమాడ్ పంతు తానింతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి. యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. "ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?" యని బాబా హేమాడ్ పంతు నడిగెను. "అవును బాబా! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కనుగొనగలిగితిని" అని హేమాడ్ పంతు బదులిచ్చెను.

బాబా యిట్లు చెప్పెను. "నా పద్దతి మిక్కిలి విశిష్ఠమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము. దాని నలవరచు కొన్నచో వృత్తులన్నియును శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకారస్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుటగాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీచేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే." బాబా యీ మాటలు పూర్తిచేయుసరికి, హారతి పూర్తియాయెను. అందరు 'శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై' యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా! యీ సమయమందు మనముకూడ మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులతో పాల్గొందుము.

హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబాచేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చెతిలో పెట్టి యిట్లనెను. "ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు." హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి "ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము, కాపాడుము." అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "ఈ కథను వినుము. దీనిని మననము చేయుము. ఇది ధ్యానము చేయుము. అట్లయనచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగను."

ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబాకృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు.

19వ అధ్యాయము చివర హేమాడ్ పంతు కొన్ని యితర విషయములను జెప్పియున్నారు. అవి యీ దిగువ పొందుపరచితిమి.

మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము

ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవయినప్పటికి అమూల్యములు, వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో, నవి మనకు మేలుజేయును. "ఎదైన సంబంధ ముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని చక్కగ ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధనముకొఱకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్నచో, నీవు ఇవ్వనక్కరలేదు, కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను, నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టివానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నీశ్చయముగా నీకు సంతోషము కులుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీ వున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలింపుము. అప్పుడు మన మిద్దరము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిదే మన కైక్యత కలుగదు, 'అల్లా మాలిక్' భగవంతుడే సర్వాధి కారి. ఇతరు లెవ్వరు మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గ మసామాన్యము; మిక్కిలి విలువైనది; కనుగొన వీలు లేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. మన ఋణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరి కొకరు తోడ్పడి ప్రేమించి సుఖఃముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందెరరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు."

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట

సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసి కొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్యశరణాగతి చేసినచో వారు నీ కెట్లు పదేపదే సహాయపడెదరో తెలియును. ప్రక్కనుంచి లేవగనే నీ కేమయిన మంచి యాలోచన కలిగిన, తరువాత పగలంతయు దానిని పృద్ధిచేసినచో నీ మేధాశక్తి వృద్ధిపొందును, నీ మనస్సు శాంతిపొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించ దలచెను. ఒక బుధవారము రాత్రిపండుకొనేటప్పు డిట్లనుకొనెను. రేపు గురువారము శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసికొని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బుట్టీవాడా దాటుచుండగా ఒక చక్కని పాటవినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడినపాట 'గురు కృపాంజన పాయో మేరే భాయి' యనునది. గురువు కృపయను అంజనము లభించెననియు దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీరాముని లోన, బయట, నిద్రావస్థలోను, జాగ్రదావస్థలోను, స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పెడుపాట యది. అనేక పాటలుండగ బాబా భక్తుడగు ఔరంగాబాదునివాసి యీపాట నేల పాడెను? ఇది సందర్భానుసారముగ బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు గావున నాతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా యా పాటను పాడించియుండును.

రామనామస్మరణ ఫలితముగూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టములనుండి కాపాడును.

ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్చి బోధ

ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేకస్థలముగాని, ప్రత్యేక సమయముగాని యక్కరలేదు. ఏదైన యవకాశము కలిగినప్పుడు అవసరము వచ్చినప్పుడెల్ల వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తునిగూర్చి పరోక్షమున ఇతరులముందు నిందించు చుండెను. ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పుల నెన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్న వారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల నింకొకవిధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేకమార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒకవిధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు గావున తిట్లుబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండీతోటకు బోవునప్పుడు మిట్టమధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను. "చూడుము! ఈ పంది కసుపును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునేతిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జేయగ నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా?" భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను.

ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు చుండెడివారు. ఈ యుపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు. "నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడ బువ్వ పుట్టును." ఇది భోజనము, వస్త్రములగూర్చి చెప్పినది. ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంతకృషి చేసిన నంతమేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా మూడున్నర మూరల శరీరమని యనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి. ఎవరైన సర్వస్యశరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో, చక్కెర-తీపి, కెరటములు-సముద్రము, కన్ను-కాంతి, కలిసి యున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరయితే చావుపుట్టుకలనుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు భాధించునట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తనకర్తవ్య కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్యశరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతరవిషయము లేమియు నాలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేకమందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడుమనెను. 'తానెవరు' అనుదానిని తెలిసికొనగోరువారికి శ్రవణమును, మననమును చేయుమని సలహా నిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మరామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదములవద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబామందిరమునకు బంపుట, కొందరికి విష్ణుసహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు; అడ్డు లేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు; కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి, ఛాతీ పైన కూర్చొని, దానిని నొక్కివేసి యెన్నడు త్రాగనని వాగ్దానము చేసినపిమ్మట వదలెను. కొందరికి స్వప్నములో 'గురుబ్రహ్మాది' మంత్రార్థముల బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను జెప్పుట కలవి గాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో నొకటి.

కష్టమునకు కూలి

ఒకనాడు మిట్టమధ్యాహ్నము బాబా, రాధాకృష్ణమాయి యింటిసమీపమునకు వచ్చి "నిచ్చెన తీసికొని రమ్ము" అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోడంకర్ యింటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్కదిగెను. బాబా యభిప్రాయమేమో యెవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. అమె జ్వరమును తొలగించుటకై బాబా యిట్లు చేసియుండును. దిగిన వెంటనే బాబా రెండు రూపాయలు నిచ్చెన తెచ్చినవాని కిచ్చెను. ఎవడో ధైర్యముచేసి నిచ్చెన తెచ్చినంతమాత్రమున వానికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము నింకొక రుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా వని చేయును. పని చేయించేవాడు, పని చేసేవారలుకూడ సుఖఃపడెదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
18, 19 అధ్యాయములు సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

V. Rama Aravind.
2009-03-25.
Posted on: 2009-03-31.
Last updated on: 2011-11-06.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me